మార్చురీలో శవం తమ కుమారుడిదేనని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివర్లో పోలీసుల తీపి కబురు!

 మార్చురీలో ఓ శవాన్ని తమ కుమారుడిగా పొరపాటున గుర్తించిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. కానీ అతడు మరో చోట బతికే ఉన్నాడని పోలీసులు చివరి నిమిషంలో కబురంపడంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిందీ ఘటన. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం మోంటూ(18) అనే కుర్రాడు తమ కూతురిని(18) కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు యువతీయువకులను వెతికేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మార్చురీలో ఉన్న ఓ శవం మోంటూది అయి ఉండొచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది. 

దీంతో, మోంటూ కుటుంబాన్ని మార్చురీ వద్దకు పిలిపించారు. తల భాగం లేకపోవడంతో శవంపై టాటూ ఆధారంగా అది తమ కుమారుడేనని గుర్తించిన అతడి తల్లిదండ్రులు బోరుమన్నారు. యువతి కుటుంబమే తమ కుమారుడిని అంతం చేసిందని ఆరోపించారు. బుధవారం రాత్రి వారు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. చివరకు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మోంటూ ఆ యువతితో కలిసి చండీఘడ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం మోంటూ కుటుంబానికి చెప్పడంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది.


More Telugu News