Narendra Modi: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా?

Will CM KCR receive PM Modi
  • కొన్నాళ్లుగా మోదీ రాష్ట్ర పర్యటనలకు దూరంగా 
    ఉంటున్న కేసీఆర్
  • ప్రొటోకాల్ పట్టించుకోవడం లేదని బీజేపీ విమర్శలు
  • ఈసారి హైదరాబాద్ లోనే అధికారిక కార్యక్రమానికి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ
కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ కేసు, తాజాగా ఎస్సెస్సీ పేపర్ లీకేజీలో ఎంపీ బండి సంజయ్ అరెస్టు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి (ఈ నెల 8న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత కొన్నాళ్లుగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఏదో ఒక కారణంతో దూరంగా ఉంటున్నారు. 

తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర రాజధానికే రావడం, ప్రగతి భవన్ కు సమీపంలోనే ఉన్న సికింద్రాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు, పరేడ్ గ్రౌండ్స్ లో సభకు హాజరవుతుండగా.. ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా? అన్న చర్చ మొదలైంది. మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‎పోర్ట్‎కు చేరుకుంటారు. అక్కడి ఉంచి రోడ్డు మార్గాన 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‎కు చేరుకోనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైల్ ప్రారంభించనున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‎కు ఆహ్వానం పంపినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రధానమంత్రికి స్వాగతం పలికే సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ గైర్హాజరైతే మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ రగడ చోటు చేసుకోనుంది.
Narendra Modi
KCR
Telangana
BRS
BJP
Hyderabad tour
G. Kishan Reddy

More Telugu News