ఆకస్మిక పర్యటన.. ఉక్రెయిన్ లో బైడెన్!
- ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు వెళ్లిన బైడెన్
- యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న సమయంలో పర్యటన
- జెలెన్ స్కీతో భేటీ.. 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సాయంపై ప్రకటన
సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు బైడెన్ చేరుకున్నారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడాతో సమావేశమయ్యేందుకు వెళ్తూ.. మధ్యలో కీవ్ లో ల్యాండ్ అయ్యారు. నిజానికి సోమవారం ఉదయాన్నే కీవ్ సహా దేశవ్యాప్తంగా అధికారులు ఎయిర్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఎవరో కీలక నేత పర్యటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ చర్చలు జరిపారు. సుమారు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్ కు అందజేయనున్నట్లు బైడెన్ ఈ సందర్భంగా తెలిపారు. సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై తాము చర్చించినట్లు జెలెన్ స్కీ వెల్లడించారు.