ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణారావు.. నోటిఫికేషన్ జారీ

Andhrapradesh High Court to have two new judges
  • కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
  • 32కు పెరిగిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
  • జ్యోతిర్మయిది తెనాలి.. గోపాలకృష్ణారావుది చల్లపల్లి
న్యాయాధికారులు పి.వెంకట జ్యోతిర్మయి, వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయగా, కేంద్ర న్యాయశాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయాధికారులైన వీరికి పదోన్నతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజయం ఈ నెల 10న కేంద్రానికి సిఫార్సు చేసింది. తాజాగా, వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. అయినప్పటికీ ఇంకా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆమె 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌కు ఎంపికయ్యారు. పలు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నారు. ఇక, వెణుతురుమల్లి గోపాలకృష్ణారావుది కృష్ణా జిల్లాలోని చల్లపల్లి. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలు అందించారు. ప్రస్తుతం గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు.
Advertisement
AP High Court
Supreme Court
V. Gopalakrishna Rao
P. Venkata Jyoyhirmai

More Telugu News