ఖమ్మం సభలో రాష్ట్ర విభజనపై చంద్రబాబు వ్యాఖ్యలు

ఖమ్మం సభలో రాష్ట్ర విభజనపై చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu comments on Telugu states
  • ఖమ్మంలో టీడీపీ శంఖారావం
  • తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామన్న చంద్రబాబు
  • తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో తెలుగు రాష్ట్రాల అంశం ప్రస్తావించారు. ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి, అక్కడి ప్రజలను ఆదుకుంటానని, కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను అభివృద్ధి చేసి తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణలోనూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, వాటి పాటికి అవి పనిచేసుకుంటూ వెళితే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధిలేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని పేర్కొన్నారు. 

తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీ అని, హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఓటు అడిగే హక్కు అందరికంటే టీడీపీకే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇవాళ తమకు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ ఎవరూ లేరని, కానీ ఎవరూ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతోందని వివరించారు. తెలంగాణలో టీడీపీ నేతలు ఇప్పటిదాకా చురుగ్గాలేనివారు ఈ సభను చూసైనా క్రియాశీలకంగా మారాలని చంద్రబాబు సభాముఖంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అనేవారికి ఇవాళ ఖమ్మం సభకు హాజరైన తమ్ముళ్ల ఉత్సాహమే జవాబు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Advertisement
Chandrababu
Khammam
TDP
Telangana
Andhra Pradesh

More Telugu News