TDP: కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడలో ఉద్రిక్తత... దేవినేని ఉమ, వర్ల రామయ్యను స్టేషన్ కు తరలించిన పోలీసులు

Tensions at TDP protests in Gudivada
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేడు గుడివాడలో ఆందోళనలు చేపట్టింది. అయితే పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్యను పామర్రు వద్ద అడ్డుకుని గూడూరు పీఎస్ కు తరలించారు. 

మరోవైపు, పెడన టీడీపీ ఇన్చార్జి కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సుల్లోనూ, బైక్ లపైనా ప్రయాణించి గుడివాడ చేరుకున్నారు. అక్కడ వారికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్లు జత కలిశారు. వారందరూ కలిసి గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొడాలి నానిపై ఫిర్యాదు చేయాలని భావించారు.

అయితే, టీడీపీ నేతలను పోలీసులు టీడీపీ కార్యాలయం వద్దే అడ్డుకున్నారు. ఫిర్యాదు అందిస్తే ఇక్కడే తీసుకుంటామని చెప్పిన పోలీసులు, అక్కడ బారికేడ్లు, రోప్ లు ఏర్పాటు చేశారు. తాము పోలీస్ స్టేషన్ వద్దే ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. 

బారికేడ్లను నెట్టివేసిన టీడీపీ నేతలు నినాదాలు చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి వన్ టౌన్ పోలీసులు స్టేషన్ కు తాళం వేశారు. దాంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ దశలో పోలీసు ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి టీడీపీ నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. 

ఇలా గుంపుగా స్టేషన్ కు రావడం సరికాదని, నలుగురు వచ్చి ఫిర్యాదు అందిస్తే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కాగిత కృష్ణప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, బోడె ప్రసాద్, జయమంగళ వెంకటరమణ పోలీస్ స్టేషన్ లోనికి వెళ్లి ఫిర్యాదు అందించారు. తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్న కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Go Back to Shorts
TDP
Gudivada
Protests
Kodali Nani
Police

More Telugu News