సీఎంల వెనుకంజ.. ఫలితాల్లో ప్రత్యర్థుల లీడింగ్
- పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకబడిన పంజాబ్ సీఎం
- ఆ రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థుల ముందంజ
- చామ్ కూర్ నియోజకవర్గంలో ఆయన పేరుతోనే ఆప్ అభ్యర్థి
- గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఉత్తరాఖండ్ సీఎంలూ ట్రెయిలింగ్ లోనే
పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ.. పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. ఆయన చామ్ కౌర్ సాహిబ్, భదౌర్ నుంచి పోటీలో నిలిచారు. అయితే, ఆ రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చామ్ కౌర్ సాహిబ్ లో డాక్టర్ చరణ్ జిత్ సింగ్, భదౌర్ లో లాభ్ సింగ్ ఉగోకేలు లీడింగ్ లో ఉన్నారు. చామ్ కూర్ సాహిబ్ లో సీఎం, ఆప్ అభ్యర్థి పేర్లు ఒకటే కావడం విశేషం. ఆ స్థానంలో ఓటర్లు గందరగోళానికి గురై కాంగ్రెస్ కు వేయబోయి ఆప్ కు ఓట్లు వేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
గోవాలో ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్.. తాను పోటీచేసిన సాక్విలిమ్ లో వెనుకబడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ సగ్లానీ ముందంజలో ఉండి దూసుకెళ్తున్నారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ కాప్రిపై వెనుకంజలో ఉన్నారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పాటియాలాలో ట్రెయిలింగ్ లో ఉన్నారు. లాల్ కువా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ వెనుకబడిపోయారు.