సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ సిక్సర్ల వర్షం... భారత్ భారీ స్కోరు
- కోల్ కతాలో చివరి టీ20
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 రన్స్
- 7 సిక్సర్లు బాదిన సూర్యకుమార్
- 2 సిక్సులు కొట్టిన వెంకటేశ్ అయ్యర్
ముఖ్యంగా సూర్యకుమార్ సిక్సర్ల జడివాన కురిపించాడు. సూర్యకుమార్ 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 7 సిక్సర్లు ఉన్నాయి. బంతి వేస్తే స్టాండ్స్ లోకి బాదడమే పనిగా సూర్యకుమార్ విరుచుకుపడ్డాడు. అతడు ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. అది కూడా భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు, వెంకటేశ్ అయ్యర్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు చెలరేగిపోయాడు. అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు, ఓపెనర్ ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెపర్డ్, రోస్టన్ చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ తీశారు.