Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

టీడీపీ హయాంలో టయర్ 2, టయర్ 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉడాన్ స్కీమ్ ను అమలు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు విమాన సర్వీసులుండేవని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సర్వీసులు ఆగిపోయాయన్నారు. కాబట్టి కడప నుంచి వేరే ప్రాంతాలకు విమానాలను నడపాలని కోరారు. ఈ మేరకు ఇవాళ ఏపీ సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.

గతంలో కడప నుంచి హైదరాబాద్, విజయవాడకు విమానంలో వెళ్లాలంటే తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దాని వల్ల సమయం వృథా అయ్యేదని, ఖర్చు కూడా ఎక్కువేనని చెప్పారు. ఆ ఇబ్బందులను తప్పించేందుకే 2018లో కడప నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప నుంచి విమాన సర్వీసులను నిలిపేశారని, దీంతో వ్యాపారులే కాకుండా సామాన్య ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Chandrababu
YS Jagan
Telugudesam

More Telugu News