పోలవరానికి కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన రూ.2,033 కోట్లను రాబట్టండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

  • పోలవరం, ఇతర ప్రాజెక్టులపై సమీక్ష
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • పోలవరం ఖర్చుపై కేంద్రంతో మాట్లాడాలన్న సీఎం జగన్
  • ఇతర ప్రాజెక్టుల పనులపై అధికారులకు దిశానిర్దేశం
పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగు నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం పనులను అధికారులు సీఎం జగన్ కు నివేదించారు. కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,033 కోట్లకు పైగా ఉందని వివరించారు.

దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి రీయింబర్స్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అన్నారు.

అటు, వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్టును నిర్దేశించిన సమయానికే అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. నేరడి వద్ద బ్యారేజి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని, మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తిచేయడంపైనా దృష్టి సారించాలని అన్నారు.

కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాల రెగ్యులేటర్ నిర్మాణ పనుల్లో ప్రాధాన్యతా క్రమం అనుసరించాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. తాండవ ప్రాజెక్టు విస్తరణతో పాటు కృష్ణా నదిపై బ్యారేజిల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News

CM Jagan Polavaram Project Review YSRCP Andhra Pradesh