Nara Lokesh: సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh wrote CM Jagan on Degree and Engineering semester exams
  • త్వరలో డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు
  • సన్నద్ధమవుతున్న వర్సిటీలు
  • ఆందోళన వ్యక్తం చేసిన లోకేశ్
  • మూడో దశ ముప్పు పొంచి ఉందని ఆందోళన
  • త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ
ఏపీలో త్వరలో డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున, పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు.

కరోనా నేపథ్యంలో, 17 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు విద్యార్థులకు పరీక్షల క్యాలెండర్లు విడుదల చేశాయని, ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ వల్ల కరోనా వ్యాప్తి చెంది మూడో దశ వచ్చే ముప్పు పొంచి ఉందని లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలిపారు.

ఉన్నత విద్యలో సెమిస్టర్ సంవత్సరాంత పరీక్షలు ఎంతో ముఖ్యమైనవేనని, అయితే లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదం అని వెల్లడించారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ వద్దంటూ ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విద్యార్థులు నిరసనలు ప్రారంభించారని లోకేశ్ ప్రస్తావించారు. ఏపీలో ఈ పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తన లేఖలో సీఎం జగన్ ను కోరారు.
Nara Lokesh
CM Jagan
Letter
Semester Exams
Degree
Engineering
Andhra Pradesh
Corona Third Wave

More Telugu News