Corona Virus: జర్మనీ నుంచి వాయుమార్గం ద్వారా 23 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు

Government To Airlift 23 Oxygen plants From Germany
  • దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
  • తీవ్ర ఆక్సిజన్‌ కొరత
  • సమస్యను అధిగమించేందుకు కేంద్రం చర్యలు
  • రక్షణశాఖకు ప్లాంట్ల దిగుమతి బాధ్యతలు
  • ఒక్కో ప్లాంటు నిమిషానికి 2,400 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి
దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అన్ని పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయిస్తున్నప్పటికీ అవసరాలు మాత్రం తీరట్లేదు. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటోంది. వాయుమార్గం ద్వారా మొత్తం 23 మొబైల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను వారం రోజుల్లో భారత్‌కు తీసుకురానున్నారు. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు అప్పగించింది.

ఒక్కో ప్లాంటు నిమిషానికి 40 లీటర్ల చొప్పున గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్‌ కేంద్రాల్లో ఈ ప్లాంట్లను వినియోగంలోకి తెస్తామని రక్షణశాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో విదేశాల నుంచి మరిన్ని ప్లాంట్లను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు.

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో పౌరులకు వీలైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాలకు ఇటీవలే అత్యవసర ఆర్థిక అధికారాలను కట్టబెట్టారు.
Corona Virus
Oxygen
Germany

More Telugu News