Corona Virus: ఢిల్లీ ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రి వద్ద హృదయ విదారక ఘటన!

Please doctors admit my wife otherwise she may die
  • కరోనా నేపథ్యంలో హృదయవిదారక దృశ్యాలు
  • ఢిల్లీ, ముంబయిలో పరిస్థితులు మరీ దారుణం
  • ఎన్ని ఆసుపత్రులు తిరిగినా చేర్చుకోని వైనం
  • నిస్సహాయులుగా మారుతున్న బాధితులు

కరోనా మహమ్మారి అనేక హృదయవిదారక దృశ్యాలను కళ్లకు కడుతోంది. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక కొవిడ్‌ బాధితులు వారి కుటుంబ సభ్యులు పడుతున్న కష్టం వర్ణించలేనిది. ఢిల్లీ, ముంబయిలో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే వైద్య సదుపాయాల కొరత ఉండగా.. రోజురోజుకీ వచ్చి చేరుతున్న కరోనా రోగుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఢిల్లీలో గురువారం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి వద్ద జరిగిన ఓ ఘటన మనసును బరువెక్కిస్తోంది. అస్లాంఖాన్‌ అనే వ్యక్తి భార్య రుబీఖాన్‌కు కరోనా సోకింది. వెంటనే ఆమెను బైక్‌పై మొత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోవడానికి ముందుకు రాలేదు.

చివరగా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్పటికే  తీవ్రంగా అలసిపోయిన అస్లాం తన నిస్సహాయతతో ఆసుపత్రి వర్గాలకు చేసిన విజ్ఞాపన అక్కడున్న వారందరినీ కలచివేసింది. ‘‘నా భార్య చనిపోయేలా ఉంది.. దయచేసి ఆమెను చేర్చుకోండి’’ అంటూ అస్లాం సిబ్బందిని వేడుకున్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, పడకల కొరత తీవ్రంగా ఉంది. వీటి కోసం ప్రభుత్వం నుంచి ఎన్ని హామీలు వస్తున్నా.. రోజురోజుకీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ పడకలన్నీ నిండిపోయాయని సిబ్బంది చెబుతుండడంతో.. కుటుంబ సభ్యులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Loading...

More Telugu News