శివాలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ.. 70 మంది ఆసుపత్రి పాలు

  • రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఘటన
  • బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • ప్రసాదం విషపూరితం కావడం వల్లేనన్న అధికారులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్న వారిలో 70 మంది ఆసుపత్రి పాలయ్యారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని శివాలయంలో నిన్న వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ప్రసాదం విషపూరితం కావడమే భక్తుల అస్వస్థతకు కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.

Rajasthan
Mahashivratri
Prasada
Sick
Devotees

More Telugu News