Nara Lokesh: పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తొక్కని అడ్డదారులు లేవు: లోకేశ్

Lokesh slams Jagan and YCP after Panchayat elections
  • పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలంటూ లోకేశ్ వ్యాఖ్యలు
  • అరాచకాలు సృష్టించారని వెల్లడి
  • అధికారులను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపణ
  • ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని వెల్లడి
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తొక్కని అడ్డదారులు లేవని విమర్శించారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామపంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి 260 ఓట్లతో గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైసీపీ గెలిచినట్టు ప్రకటించి కొంతమంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు.

అధికార మదంతో అరాచకాలు సృష్టించారని, అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి, విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. చీకటి మాటున గెలిచాం అని ప్రకటించుకున్నా, పగలు ధైర్యంగా తిరగలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని, ఆధారాలు పరిశీలించి రీకౌంటింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Jagan
YSRCP
Gram Panchayat Elections
Telugudesam
Andhra Pradesh

More Telugu News