ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం: చంద్రబాబు
- ఉపాధ్యాయులపై కక్ష సాధింపులకు పాల్పడటం దారుణం
- మద్యం షాపుల్లో పెట్టి మద్యం అమ్మించారు
- టీచర్లపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి
విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్య ఉండే ఉపాధ్యాయులను దేశంలో ఎక్కడాలేని విధంగా మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పబ్లిసిటీ పిచ్చితో పాఠశాలలు తెరిచి, వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా చేశారని మండిపడ్డారు.
వారం రోజులలో సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ, బకాయిలు లేకుండా సమయానికి డీఏల చెల్లింపులపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని, టీచర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.