నీటి సమస్యపై.. మంత్రి కేటీఆర్ కి అసదుద్దీన్ విజ్ఞప్తి

Owaisis request to KTR
  • నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది
  • తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి
  • కృష్ణా ఫేజ్2, ఫేజ్3 నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలి
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 1, 2, 3 డివిజన్లలో విపరీతమైన నీటి సమస్య ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వేసవి కావడంతో ఈ సమస్య మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించి, ఇక్కడి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలని మంత్రి కేటీఆర్ ను, సంబంధిత అధికారులను కోరుతున్నానని అన్నారు.

లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, ఇతర కమర్షియల్ కార్యకలాపాలు మూతపడిన తరుణంలో కూడా నీటి కొరత ఉండటం  ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ప్రజలంతా ఇంటి వద్దే ఉండటంతో నీటి వినియోగం పెరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేయకుండా... వాటర్ ట్యాంకర్లను పంపడం వల్ల సామాజిక దూరం అనే దానికి అర్థం ఉండదని ఒవైసీ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. కృష్ణా ఫేజ్2, ఫేజ్3 నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని విన్నవించారు.
Go Back to Shorts
Asaduddin Owaisi
MIM
KTR
TRS

More Telugu News