బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి...: లోకేశ్ పరిస్థితి ఇదేనన్న రోజా!
- దమ్ముంటే మండలిని రద్దు చేయాలన్న లోకేశ్
- సెటైర్లు వేస్తూ స్పందించిన రోజా
- అభివృద్ధికి అడ్డొస్తే, దేన్నయినా తొలగిస్తామని వ్యాఖ్య
ఇంకో మహా మేధావి ఉన్నాడండీ... యనమల రామకృష్ణుడు. ప్రజల తీర్పు ఏంటి? ఆయన్ను రెండుసార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించడాన్ని మనం చూశాం. ప్రజలు అసహ్యించుకున్న ఈయన, ప్రపంచ మేధావిలాగా ఫీల్ అవుతూ, ప్రజా తీర్పును అవమానించేలా మండలిలో ప్రవర్తిస్తున్నారు" అని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
ప్రజలు అత్యధిక మెజారిటీని ఇచ్చి, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా, అభివృద్ధి పరమైన నిర్ణయాలను అమలు చేయలేకపోతే ఎలాగని రోజా ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుతగిలే దేన్నయినా, పక్కకు తప్పించాల్సిందేనని వ్యాఖ్యానించారు. శాసనమండలి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారికి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, వారింకా అదే పద్ధతిలో వెళుతున్నారని విమర్శలు గుప్పించారు.