ప్రజల తరఫున అన్ని విధాలా పోరాడే హక్కు ప్రతిపక్షానికి ఉంది: చంద్రబాబు నాయుడు
- నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాల తీరుపై బాబు ఫైర్
- బిల్లులపై మాట్లాడే సమయం మాకు ఇవ్వలేదు
- నిబంధనలతో పని లేకుండా సమావేశాలు నిర్వహించారు
మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, బిల్లులు ఎలా ఉన్నాయో పరిశీలించి అసెంబ్లీలో చర్చించడం ప్రతిపక్షం పని అని, ఇంత సీరియస్ బిల్లులపై మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించకపోవడం దారుణమని మండిపడ్దారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడేందుకే ఎక్కువ సమయం తీసుకున్నారని, తనపై వారి ఇష్టానుసారం విమర్శలు చేశారని, ‘బండబూతులు’ తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీటన్నింటికి ఓర్చుకుని తాము సభలో ఉన్నప్పటికీ, తమ సభ్యులను సస్పెండ్ చేయడం, మార్షల్స్ తో బయటకు పంపించడం దారుణమైన విషయమని అన్నారు. మూడు రాజధానులు వద్దు అని, అమరావతిని తరలించవద్దంటూ డిమాండ్ చేసిన తమపై మంత్రులు, వైసీపీ సభ్యులు మూకుమ్మడి దాడి చేయడం వంటి ఘటనలు బాధాకరమని అన్నారు.
సభ్యులను సస్పెండ్ చేయాలంటే ఒక ప్రొసిజర్ ఉంటుందని, అలాంటివి ఏవీ పట్టించుకోకుండా సమావేశాలను నిర్వహించారని విమర్శించారు. ప్రజాసమస్యల తీవ్రతను అనుసరించి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తి కూడా ఒకప్పుడు అసెంబ్లీలో బెంచ్ ఎక్కి తన నిరసన తెలిపారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమస్య తీవ్రతను అనుసరించి ప్రభుత్వం యొక్క ఆలోచనా విధానం మార్చడానికి ప్రజల తరఫున అన్ని విధాలా పోరాడే హక్కు ప్రతిపక్షానికి ఉందని, నిరసన తెలియజేసే హక్కు తమకు లేదనట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తించారని ధ్వజమెత్తారు.