రాములోరి తెప్పోత్సవంలో అపశ్రుతి.. బోటులో పేలిన బాణసంచా
- హంస వాహనాన్ని అనుసరిస్తున్న బోటులో ఘటన
- భయంతో గోదావరి నదిలోకి దూకేసిన నలుగురు
- ఒకరి గల్లంతు...ముగ్గురు సురక్షితం
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చారిత్రక క్షేత్రం భద్రాద్రిలో అపశ్రుతి దొర్లింది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తుండగా బాణసంచా పేలింది. హంస వాహనాన్ని అనుసరిస్తున్న బోటులో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. దీంతో భయపడిన బోటులోని నలుగురు వ్యక్తులు నదిలోకి దూకేశారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా ఒకరు గల్లంతయ్యారు. కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే జరిగిన ఘటనతో ఆవేదనకు లోనాయ్యారు.