వృద్ధురాలి ముఖానికి నల్లరంగు పూసి.. మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన వైనం

  • హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
  • మంత్రగత్తె నెపంతో దాడి
  • వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
  • 21 మంది అరెస్ట్
చేతబడి చేస్తుందన్న నెపంతో ఓ వృద్ధురాలి (81) ని గ్రామస్థులు దారుణంగా హింసించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. సర్కాఘట్‌ సబ్‌డివిజన్‌లోని సమహాల్‌ గ్రామంలో ఓ వృద్ధురాలి ముఖానికి నల్ల రంగు పూశారు. అనంతరం చెప్పుల దండతో ఊరేగించి, ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో  21 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ ఆదేశించారు. ఈ కేసులో  దర్యాప్తు కొనసాగుతోందని మండి ఎస్పీ గౌరవ్‌ శర్మ మీడియాకు చెప్పారు. బాధితురాలి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ.. తమ తల్లిపై దాడి జరిగే అవకాశం ఉందని తాము గత నెల 23నే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే వారు అంతగా పట్టించుకోలేదని తెలిపారు.
Go Back to Shorts
Himachal Pradesh
Crime News
Police

More Telugu News