నేడే 'చంద్రయాన్ 2' పయనం.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచం!

  • సాంకేతిక కారణాలతో ఓసారి వాయిదా పడిన ప్రయోగం
  •  లాంచ్ విండో వ్యవధి నిమిషమే
  • సవాలును స్వీకరించిన ఇస్రో శాస్త్రవేత్తలు
సాంకేతిక కారణాలతో వాయిదాపడిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ శుభ ఘడియ కోసం దేశ ప్రజలే కాదు.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ నిరాటంకంగా సాగుతోంది. 3.8 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 నిర్ణీత కక్ష్యలో వదిలిపెట్టేందుకు రెడీ అయింది.

నిజానికీ ప్రయోగం ఈ నెల 15నే జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో రాకెట్ క్రయోజెనిక్ ట్యాంకర్‌లో లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్‌డౌన్‌‌ను ఆపేసి ప్రయోగాన్ని నిలిపేశారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది ప్రయోగానికి సిద్ధం చేశారు.  

కొన్నాళ్ల పయనం తర్వాత చంద్రుడిపై దిగనున్న ల్యాండర్ నుంచి దిగే రోవర్ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజులు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారంతోపాటు అక్కడి ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై నీటి ఆనవాళ్ల గురించి పరిశోధిస్తుంది. అలాగే, ఖనిజాలు, రాతి నిర్మాణాలపైనా పరిశోధనలు చేస్తుంది.

నిజానికి ఈ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలకు సవాలుతో కూడుకున్నదేనని చెప్పాలి. ఈ నెల 15న పది నిమిషాల లాంచ్ విండో లభ్యం కాగా, నేటి లాంచ్ విండో సమయం నిమిషమే వుంది. అయినప్పటికీ సవాలుగా తీసుకున్న శాస్త్రవేత్తలు అతి తక్కువ నిడివిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని విజయవంతం చేస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
chandrayaan
ISRO
sriharikota
Moon mission

More Telugu News