రీ వాల్యుయేషన్ లో మార్కులు పెరిగితే రుసుము వెనక్కి.. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం

  • మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు  
  • విద్యార్థుల మేలు కోసమే
  • వెల్లడించిన విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి
ఇప్పటికే ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయనున్నట్టు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్కులు పెరిగితే, రుసుమును వెనక్కు ఇచ్చేయాలని మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో జవాబు పత్రానికి రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థుల మార్కులు పెరిగితే, ఫీజుగా తీసుకునే రూ. 600 వెనక్కు ఇచ్చేస్తామని విద్యా శాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం తాము రాసిన ఆరు పేపర్ల పునఃపరిశీలనకు విద్యార్థులు రూ. 3 వేలు చెల్లిస్తున్నారు. ఒకవేళ మార్కులు పెరిగినా, ఇప్పటివరకూ చెల్లించిన డబ్బును వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. మార్కులు పెరిగితే, తొలిసారిగా దాన్ని దిద్దిన అధ్యాపకుడు చేసిన తప్పు తీవ్రతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 20 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరమూ రీ వాల్యుయేషన్ కు 18 నుంచి 20 వేల వరకూ దరఖాస్తులు వస్తుండగా, ఈ సంవత్సరం ఇప్పటికే 75 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.
Go Back to Shorts
Telangana
Inter
Exams
Re Valuation

More Telugu News