ఓటేసేందుకు వచ్చి కుప్పకూలి మరణించిన వ్యక్తి!
- వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఘటన
- ఓటేసేందుకు వచ్చిన పెరుమాండ్ల స్వామి
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి పోలింగ్ బూత్ లో కుప్పకూలి మరణించిన విషాద ఘటన వరంగల్ లో జరిగింది. ఇక్కడి పైడిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్దకు ఓటేసేందుకు పెరుమాండ్ల స్వామి అనే వ్యక్తి వచ్చాడు. క్యూలైన్ లో చాలాసేపు నిలబడిన అతను, తీరా తన వంతు రానున్న తరుణంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఇతర ఓటర్లు, హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగానే, ఆయన ప్రాణాలు పోయాయి. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.