పవన్ కంటే చిరంజీవి 100 రెట్లు బలవంతుడు: కేశినేని నాని
- చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ
- పవన్ కు స్థిరత్వం, పరణతి లేవు
- జనసేనకు ఒక్క సీటు కూడా రాదు
ప్రజారాజ్యం అనేది చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, నాగబాబు అందరూ కలసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని నాని చెప్పారు. అలాంటి చిరంజీవికే 18 సీట్లు వచ్చాయని... తన సొంత స్థానంలోనే ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, ఆయన కూడా ఓడిపోతారని చెప్పారు. 2014 ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య అని... అప్పట్లో ఒక్క ఓటును కూడా తాము వదులుకునే పరిస్థితి లేదని... అందుకే తమతో వచ్చే అందరినీ కలుపుకుని వెళ్లామని తెలిపారు.
పవన్ కల్యాణ్ కు స్థిరత్వం లేదని కేశినేని నాని విమర్శించారు. పవన్ ను వదులుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన సమస్యలన్నింటినీ చంద్రబాబు పరిష్కరించారని... ఒక మిత్రపక్షంగానే పవన్ చెప్పినవన్నీ చంద్రబాబు చేశారని తెలిపారు. ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుని చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తున్నారని... తాము ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్ధమేనని చెప్పారు. స్థిరత్వం, పరణతి లేకపోవడం వల్లే పవన్ అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవిశ్వాసం పెడితే మిగిలిన ఎంపీల మద్దతును కూడగడతానని చెప్పిన పవన్... ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అంటే, బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు.