ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి?: బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా పవన్ సంచలన విమర్శ

  • బైక్ సైలెన్సర్లు తీసేసి పవన్ అభిమానుల ర్యాలీ
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • తుపాకులు పేల్చి బయట తిరిగేవాళ్ల సంగతేంటని పవన్ ప్రశ్న
  • భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వ్యాఖ్యలు
ఇంట్లో తుపాకీతో కాల్చిన వారు ఇప్పుడు బయట తిరుగుతున్నారని, పోలీసులు వాళ్లను ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు చేశారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన ఆయన, ఇటీవల తన అభిమానులు నిర్వహించిన ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

జ‌న‌సేన సైనికులు బైక్ సైలెన్స‌ర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసిన‌ట్లు చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంట్లో తుపాకీతో కాల్చి బ‌య‌ట‌ తిరుగుతున్న వాళ్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. జ‌న‌ సైనికుల సంస్కారం చాలా గొప్ప‌ద‌ని వ్యాఖ్యానించిన ఆయన, అధికారులు లంచాల మ‌త్తులో మునిగి ఉన్నారని, అక్ర‌మంగా ఆక్వాకు వంత‌ పాడ‌ుతున్నారని, అందువల్లే తాగు నీరు క‌లుషిత‌మ‌వుతుంద‌ని ఆరోపించారు.

కాగా, పవన్ కల్యాణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ విమర్శలు చేసినప్పటికీ, ఇవి హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి చేసినవేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పెడుతున్నారు. 2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది.
Go Back to Shorts
Pawan Kalyan
Bhimavaram
Fans
Balakrishna
Firing

More Telugu News