యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
- కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి వెళ్లిన భువనేశ్వరి
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
- రంగమండపంలో వేదాశీర్వచనం పలికిన పండితులు
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతం యాదాద్రిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నారా భువనేశ్వరి గర్భాలయంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని బహూకరించారు. మరోవైపు, వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఆమె పర్యటన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.