నాడు కోహ్లీతో కలిసి వరల్డ్ కప్ ఆడాడు... ఇప్పుడు ఐపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్నాడు!

Kohli met his worldcup mate who standing as umpire in IPL
  • 2008 అండర్-19 ప్రపంచకప్ హీరో.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్
  • మైదానంలో కలుసుకున్న విరాట్ కోహ్లీ, అజితేష్ అర్గల్
  • ఒకప్పుడు సహచరులు.. ప్రస్తుతం ఒకరు ఆటగాడు, మరొకరు అంపైర్
  • వారి కలయికకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
క్రికెట్ మైదానంలో ఎన్నో ఆసక్తికర దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అలాంటిదే ఐపీఎల్ 2026లో చోటుచేసుకుంది. ఒకప్పుడు ఒకే జట్టుకు ఆడి, దేశానికి ప్రపంచకప్ అందించిన ఇద్దరు ఆటగాళ్లు.. ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే మైదానంలో కలుసుకున్నారు. అయితే వారి పాత్రలు మారాయి. ఒకరు స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతుంటే, మరొకరు అంపైర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు. వారే విరాట్ కోహ్లీ, అజితేష్ అర్గల్.

2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో అజితేష్ అర్గల్ కీలక సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచాడు. ఆ తర్వాత కోహ్లీ భారత జట్టులో సూపర్‌స్టార్‌గా ఎదిగితే, అర్గల్ కెరీర్ మాత్రం అంతగా ముందుకు సాగలేదు. కొంతకాలం ఐపీఎల్‌లో ఆడినా, తర్వాత క్రికెట్‌కు దూరమై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. అయితే, క్రికెట్‌పై మమకారం చంపుకోలేక బీసీసీఐ అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై, ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా సేవలందిస్తున్నాడు.

ఏప్రిల్ 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అర్గల్ అంపైర్‌గా వ్యవహరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, అర్గల్ మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ పాత స్నేహితుడిని అంపైర్ పాత్రలో చూసిన కోహ్లీ నవ్వుతూ పలకరించడం అభిమానులను ఆకట్టుకుంది. ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న స్నేహితులు.. ఒకరు ఆటగాడిగా, మరొకరు అంపైర్‌గా ఒకే మైదానంలో కలవడం "లైఫ్ ఫుల్ సర్కిల్" అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 
Go Back to Shorts
Ajitesh Argal
Virat Kohli
Umpire
Under-19 World Cup

More Telugu News