వేసవి ముగిసినా ఏమాత్రం తగ్గని రద్దీ... వెంకన్న దర్శనం లేకుండానే వెనుదిరుగుతున్న భక్తులు!

  • భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు
  • రెండు కిలోమీటర్ల మేరకు క్యూలైన్
  • సర్వదర్శనానికి 35 గంటల సమయం
వేసవి సెలవులు ముగిసి, దక్షిణాది రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా, రైతులు పొలం పనులకు సిద్ధమవుతున్నా, తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఉదయం స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు మొత్తం నిండిపోగా, దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు క్యూలైన్ బయట భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

సర్వదర్శనం క్యూలైన్ లో స్వామి దర్శనానికి 35 గంటల సమయం పడుతూ ఉంది. అంటే ఈ మధ్యాహ్నం తిరుమలకు వస్తే, ఎల్లుండే స్వామి దర్శనం. ఈ పరిస్థితుల్లో అంతసేపు వేచి ఉండలేక, పలువురు భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనక్కు వెళ్లిపోతున్నారు. ఇక నడకదారిలో ప్రయాణించి వచ్చిన భక్తులు 13 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దె గదులు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడంతో ఇనుప షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాల్లోనే భక్తులు పడిగాపులు పడుతున్నారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News