అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ: గుజరాత్ లో రాహుల్ గాంధీ ప్రకటన

  • రైతు రుణమాఫీ ప్రకటించిన రాహుల్ గాంధీ
  • అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ప్రణాళిక ప్రకటన
  • రైతుల గురించి మాట్లాడే మోదీ 22 ఏళ్లు వారికి ఏమీ చేయలేదు
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవానికి గండికొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అమ్రేలిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్తలకు 1.25 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రధానిని తాము రైతు రుణమాఫీ గురించి అడిగితే.. అది తమ విధానం కాదని తోసిపుచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రుణమాఫీపై విధానం ప్రకటిస్తామని అన్నారు.

గత 22 ఏళ్లుగా రైతుల గురించి మాట్లాడుతున్న మోదీ వారికి చేసిందేమీ లేదని అన్నారు. రైతుల భూములు గుంజుకుని, సాగు నీటితో సహా వాటిని పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. రైతులకు కనీసం పంటబీమా కూడా అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రబ్బర్ స్టాంప్ అన్న రాహుల్, రాష్ట్ర పాలన అమిత్ షా చేతిలో ఉందని అన్నారు.

గుజరాత్‌ లో పటేళ్లు, దళితులు, రైతులు, అంగన్‌ వాడీ కార్యకర్తలు సహా అన్ని వర్గాల ప్రజలు తొలిసారిగా నిరసన బాటపట్టారని ఆయన తెలిపారు. విమానాల్లో తిరిగే మోదీ స్నేహితులు ఐదుగురు లేక పదిమంది మాత్రమే గుజరాత్ లో సంతోషంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
Gujarath elections
loan waiver farmers
Rahul Gandhi
promise

More Telugu News