శశికళ వర్గానికి షాక్.. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!
- వ్యూహాత్మకంగా వ్యవహరించిన పళనిస్వామి వర్గం
- విప్ ను ధిక్కరించారంటూ వేటు
- భగ్గుమన్న దినకరన్ వర్గం
- హైకోర్టుకు వెళతామంటూ ప్రకటన
తమిళ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. శశికళ, దినకరన్ లకు ముఖ్యమంత్రి పళనిస్వామి షాక్ ఇచ్చారు. దినకరన్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వీరిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్ ను ఈ 18 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని... అందుకే వీరిపై వేటు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శశికళ వర్గాన్ని కోలుకోకుండా చేసే క్రమంలో పళని వర్గం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. బలపరీక్షకు వెళ్లే ముందు వీరిపై వేటు పడటంతో... రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు చైన్నకి వస్తున్న రోజే దినకరన్ వర్గంపై వేటు పడటం గమనార్హం. మరోవైపు, స్పీకర్ నిర్ణయంపై దినకరన్ వర్గీయులు భగ్గుమన్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు.