Advertisement

వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ విజయవంతం.. హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకున్న కృష్ణా జలాలు

Veligonda Project trial run successful Krishna waters reach head regulator
  • సంతృప్తికరంగా ముగిసిన వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్
  • కొల్లం వాగు వద్ద గేట్లు ఎత్తి సొరంగంలోకి కృష్ణా జలాల విడుదల
  • రేపు ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు
  • ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కరవు ప్రాంతాలకు తీరనున్న నీటి కష్టాలు
ప్రకాశం జిల్లాతో పాటు పలు జిల్లాల దశాబ్దాల సాగు, తాగునీటి కలను సాకారం చేసే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించి అధికారులు ఆదివారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో కరవు సీమలో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఆదివారం ఉదయం అధికారులు కొల్లం వాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి సొరంగ మార్గంలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గేట్ల పనితీరు, సొరంగంలో నీటి ప్రవాహ వేగాన్ని, నీటి తరలింపు ప్రక్రియను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సొరంగంలో పరుగులు తీసిన కృష్ణా జలాలు గంటవానిపల్లి క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా రెగ్యులేటర్ వద్ద సైరన్ మోగించి సమీప ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీశైలం జలాశయం ముందు భాగం నుంచి సుమారు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను తరలించి, నల్లమల సాగర్‌లో నిల్వ చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించనున్నారు. ముఖ్యంగా మార్కాపురం వంటి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల నీటి కష్టాలకు ఈ ప్రాజెక్టుతో శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Advertisement
Veligonda Project
Chandrababu Naidu
Krishna River Waters
Prakasam District Irrigation
Nallamala Sagar Reservoir
Andhra Pradesh Water Projects

More Telugu News