పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్పై ప్రకాశ్ రాజ్ సెటైర్
- తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన
- వస్తామంటే వద్దంటామా సార్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
- ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మండిపడుతున్న జనసైనికులు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ వేసిన ఒక పరోక్ష వ్యంగ్యాస్త్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తోంది. పవన్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే, ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సెటైరికల్ పోస్ట్ పెట్టారు.
"వస్తానంటే వద్దంటామా.. రండి సార్. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా" అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి తన సిగ్నేచర్ హ్యాష్ట్యాగ్ #JustAsking ను కూడా జత చేశారు.
ఈ ట్వీట్ బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ, రచ్చ మొదలయ్యాయి. పవన్ అభిమానులు ప్రకాశ్ రాజ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు, గతంలో బెంగళూరులో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన మీ చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాలంటూ నెటిజన్లు ప్రకాశ్ రాజ్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ తెలంగాణలోకి ఎలా వస్తే మీకెందుకు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో కూడా జనసేన పార్టీ.. బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి పొత్తులోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.