Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు

Ram Mohan Naidu Secures Rs 30 Lakhs for Srikakulam Schools
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మార్గం సుగమమైంది. విద్యార్థులకు చదువుతో పాటు అదనపు నైపుణ్యాలు అందించే లక్ష్యంతో 'స్కిల్ ల్యాబ్స్' ఏర్పాటు కోసం రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది.

ఈ నిధులతో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్, మంత్రి సొంత గ్రామమైన నిమ్మడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కిల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.15 లక్షల చొప్పున కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తన జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని రామ్మోహన్ నాయుడు గతంలో పియర్సన్ ఇండియా ప్రతినిధులతో సమావేశమై కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు సంస్థ ఈ నిధులను విడుదల చేసింది.

ఈ ల్యాబ్స్‌ ఏర్పాటు బాధ్యతలను సర్వ శిక్షా అభియాన్ అధికారులకు అప్పగించారు. వీటి నిర్వహణ, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ బాధ్యతలను 'కాగ్నో స్పేస్' అనే సంస్థ చూసుకోనుంది. కాగా, శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రామ్మోహన్ నాయుడు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 
Go Back to Shorts
Ram Mohan Naidu
Srikakulam
Skill Labs
Pearson India
CSR Funds
Education
NTR Municipal High School
Zilla Parishad High School
Andhra Pradesh
School Development

More Telugu News