కాలుష్యానికి ఇక బైబై.. ట్రాక్‌పైకి ‘గ్రీన్ ట్రైన్’: నేడు జింద్-సోనిపట్ మధ్య పరుగు తీయనున్న సరికొత్త హైడ్రోజన్ రైలు!

Hydrogen Train to run between Jind and Sonipat as PM Modi flags off Indias first green train
  • భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్న మోదీ
  • హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య పైలట్ ప్రాజెక్టుగా నడవనున్న రైలు
  • హైడ్రోజన్ ఇంధన సాంకేతికతను వాడుతున్న ఎంపిక చేసిన ప్రపంచ దేశాల సరసన భారత్
  • 'అమృత్ భారత్' కింద మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ రైల్వే స్టేషన్ వర్చువల్ ప్రారంభోత్సవం
భారతీయ రైల్వే రంగాన్ని పర్యావరణహితంగా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రతిష్ఠాత్మక రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం, నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్య సాధన కోసం రైల్వేలో హైడ్రోజన్ సాంకేతికతను వాడుతున్న ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన అగ్రదేశాల సరసన భారతదేశం నిలిచింది.

జింద్ - సోనిపట్ మధ్య తొలి ప్రయాణం
ఈ గ్రీన్ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే హర్యానాలోని 'జింద్-సోనిపట్' రైల్వే లైనును పైలట్ రూట్‌గా ఎంపిక చేసింది. ఈ రైలు నడక కోసం జింద్‌లో స్వదేశీ సాంకేతికతతో కూడిన హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్‌ను సురక్షితంగా నిల్వ చేయడానికి, సరఫరా చేయడానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇప్పటికే మంజూరు చేసింది. ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాకప్ కోసం ఇక్కడ అదనపు కంప్రెసర్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచారు.

పొగ రాదు.. కేవలం నీటి ఆవిరి మాత్రమే!
సాధారణ డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైళ్లు పూర్తిగా భిన్నమైనవి. ఇందులోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత.. ఒక రసాయన ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కావు. కేవలం 'నీటి ఆవిరి' మాత్రమే ఉద్గారంగా బయటకు వస్తుంది. ఈ విప్లవాత్మక సాంకేతికతను ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు మాత్రమే పరీక్షిస్తుండగా, ఇప్పుడు భారత్ కూడా ఆ క్లబ్‌లో చేరిపోయింది.

మధ్యప్రదేశ్‌లో 'అమృత్ భారత్' స్టేషన్ ప్రారంభం
ఈ హైడ్రోజన్ రైలు ప్రారంభోత్సవంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద ఆధునికీకరించిన మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ రైల్వే స్టేషన్‌ను కూడా పీఎం మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా టికంగఢ్‌లో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.189 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను సీఎం పంపిణీ చేయనున్నారు.
Advertisement
Hydrogen Train
Narendra Modi
Jind Sonipat Route
Indian Railways
Green Train India
Zero Emission Train

More Telugu News