కూతురి కిడ్నాప్ కేసు వెనక్కి తీసుకోలేదని.. నిద్రిస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు!

Subodh Yadav shot dead for refusing to withdraw daughter kidnapping case in Munger
  • బీహార్‌లోని ముంగేర్ జిల్లా సఫియాసరాయ్ పరిధిలో దారుణ హత్య
  • రెండు నెలల క్రితం బాధితుడి కుమార్తె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
  • కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని రెండు రోజుల ముందే నిందితుల హెచ్చరిక
  • హైవేను దిగ్బంధించి గ్రామస్థుల నిరసన
మైనర్ అయిన తన కుమార్తె కిడ్నాప్‌నకు గురైందంటూ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన తండ్రిని దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇటుకల బట్టీలో నైట్ గార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలలోకి రెండు బుల్లెట్లు దించి ఈ దారుణానికి ఒడిగట్టారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డక్రా సత్ఖజురియా గ్రామానికి చెందిన సుబోధ్ యాదవ్ (45) సఫియాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'రాజా ఈట్ భట్ఠా'లో రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే విధులకు హాజరైన ఆయన, భట్ఠా కార్యాలయం పక్కనే ఉన్న గది బయట మంచంపై నిద్రిస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు.. నిద్రిస్తున్న సుబోధ్ తలలోకి అతి సమీపం నుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలు విని తోటి కార్మికులు పరుగెత్తుకు వచ్చేసరికే ఆయన రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. చీకటిని ఆసరాగా చేసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

కేసే ప్రాణాలు తీసింది!
రెండు నెలల క్రితం సుబోధ్ యాదవ్ మైనర్ కుమార్తెను స్థానిక యువకుడు ప్రేమ పేరుతో అపహరించుకుపోయాడని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై సుబోధ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, సదరు యువకుడి తండ్రి దేవన్ యాదవ్, సోదరుడు అంకిత్ యాదవ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. ఆనాటి నుంచి ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ నిందితుల కుటుంబం నుంచి సుబోధ్‌కు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని హత్యకు రెండు రోజుల ముందే వారు నేరుగా వచ్చి బెదిరించారని, అన్నట్లుగానే పక్కా స్కెచ్‌తో ఈ హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

జాతీయ రహదారి దిగ్బంధం
ఈ దారుణ హత్య ఉదంతం తెలియగానే ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు, బాధితుడి బంధువులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి 'ముంగేర్-లఖిసరాయ్' జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తీవ్రతను గమనించిన ముంగేర్ ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును పర్యవేక్షించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం భట్ఠాలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ప్రాథమిక విచారణ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
Advertisement
Subodh Yadav
Munger Murder Case
Bihar Crime News
Kidnapping Case Revenge
Night Guard Shot Dead
Munger Police Investigation

More Telugu News