Shabeer Ahmed Lone: మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

Delhi Police arrest LeT terrorist Shabir Ahmed Lone in Metro poster case
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఆదివారం రాత్రి ఘాజీపూర్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్లు అతికించిన ఘటనకు సంబంధించిన ఉగ్ర మాడ్యూల్‌కు షబీర్ లోన్ హ్యాండ్లర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

గత ఫిబ్రవరి 8న సుప్రీంకోర్టు, జన్‌పథ్ మెట్రో స్టేషన్లతో సహా పలు ప్రాంతాల్లో దేశ వ్యతిరేక సందేశాలతో కూడిన పోస్టర్లు కలకలం రేపాయి. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన స్పెషల్ సెల్ అధికారులు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి నిఘాతో దర్యాప్తు చేపట్టారు.

ఈ అరెస్టును ధృవీకరించిన అదనపు సీపీ ప్రమోద్ సింగ్ కుష్వాహా కీలక వివరాలు వెల్లడించారు. "గతంలో మేం ఛేదించిన ఓ ఉగ్ర మాడ్యూల్‌కు షబీర్ లోన్ నాయకుడిగా ఉండేవాడు. అందులో ఏడుగురు బంగ్లాదేశీయులు, ఒక భారతీయుడు ఉన్నారు. ఆ మాడ్యూల్ ఛిన్నాభిన్నం కావడంతో, కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేసి, యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు అతడు మళ్లీ భారత్‌లోకి ప్రవేశించాడు" అని వివరించారు.

షబీర్ లోన్ గతంలో 2007, 2015 సంవత్సరాల్లోనూ అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. 2015లో కశ్మీర్‌లో పట్టుబడినప్పుడు అతని వద్ద ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 2019లో బెయిల్‌పై విడుదలైన షబీర్, ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ నుంచే లష్కరే తోయిబా అగ్ర కమాండర్లు, 2008 ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీలతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని, ఉగ్ర కుట్ర పూర్తి వివరాలు, వారి లక్ష్యాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Shabeer Ahmed Lone
Lashkar-e-Taiba
LeT
Delhi Metro
Terrorist Arrest
Anti-India Posters
Hafiz Saeed
Mumbai Attacks
Ghaziabad
India

More Telugu News