Daryl Mitchell: బంతి బలంగా తగిలిందని అర్షదీప్ పైకి దూసుకువచ్చిన డారిల్ మిచెల్... వీడియో ఇదిగో!

Daryl Mitchell Confronts Arshdeep Singh After Ball Hit Him
  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర పోరు
  • ఫాలో త్రూలో మిచెల్ తొడపైకి బంతి విసిరిన బౌలర్ అర్ష్‌దీప్
  • మైదానంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న తీవ్ర వాగ్వాదం
  • మధ్యవర్తిత్వం వహించి గొడవ సద్దుమణిగేలా చేసిన కెప్టెన్ సూర్య
  • భారీ విజయంతో టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న టీమిండియా
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈరోజు (మార్చి 8) జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ, మైదానంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ మధ్య జరిగిన వాగ్వాదం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. అర్ష్‌దీప్ వేసిన బంతిని డారిల్ మిచెల్ నేరుగా బౌలర్ వైపు ఆడాడు. బంతిని అందుకున్న అర్ష్‌దీప్ వెంటనే వికెట్ల వైపు విసరగా.. అది అనూహ్యంగా మిచెల్ తొడకు బలంగా తాకింది. అనవసరమైన త్రో కావడంతో పాటు, అర్ష్‌దీప్ వెంటనే క్షమాపణ చెప్పకపోవడంతో మిచెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటుతుందన్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకున్నాడు.

సూర్యకుమార్ చొరవతో మిచెల్ శాంతించాడు. అంపైర్లు కూడా కలుగజేసుకోవడంతో వాతావరణం సద్దుమణిగింది. అనంతరం అర్ష్‌దీప్, మిచెల్ ఇద్దరూ కరచాలనం చేసుకుని గొడవకు ముగింపు పలికారు. సూర్యకుమార్ యాదవ్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్, టీ20 వరల్డ్ కప్‌ను మరోసారి కైవసం చేసుకుని టైటిల్‌ను నిలబెట్టుకుంది. 
Daryl Mitchell
Arshdeep Singh
T20 World Cup
Suryakumar Yadav
India vs New Zealand
Cricket Controversy
Cricket Fight
Narendra Modi Stadium
Cricket News
T20 World Cup Final

More Telugu News