Mohammad Amir: ఆటగాళ్లే బలిపశువులా?.. పీసీబీపై నిప్పులు చెరిగిన మహ్మద్ ఆమిర్

Mohammad Amir Criticizes PCB for Blaming Players After World Cup Failure
  • టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యంపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం
  • ఆటగాళ్లకు భారీ జరిమానాలు విధించాలని పీసీబీ యోచన
  • ఒక్కో ఆటగాడికి 50 లక్షల పాక్ రూపాయల ఫైన్ వేసే అవకాశం
  • పీసీబీ నిర్ణయంపై మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ తీవ్ర విమర్శలు
  • ఆటగాళ్లను కాదు.. సెలక్టర్లను శిక్షించాలని ఆమిర్ డిమాండ్
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు సూపర్ 8 దశలోనే నిష్క్రమించడం ఆ దేశ క్రికెట్‌లో పెను దుమారానికి దారితీసింది. జట్టు ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పేలవమైన ప్రదర్శన కనబరిచినందుకు ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్థాన్ రూపాయల (భారత కరెన్సీలో సుమారు రూ. 16ల‌క్ష‌లు) వరకు భారీ జరిమానా విధించాలని యోచిస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థి భారత్, ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, శ్రీలంకపై గెలిచినా మెరుగైన రన్‌రేట్ సాధించడంలో విఫలమై సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

అయితే, ఆటగాళ్లపై ఆర్థిక జరిమానాలు విధించాలన్న పీసీబీ ప్రతిపాదనను పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆటగాళ్లను బలిపశువులను చేస్తున్నారని, ఈ చర్య సరైంది కాదని మండిపడ్డాడు. "జరిమానాలు విధించడమే పరిష్కారమైతే, సెలక్టర్ల నుంచి మొదలుకొని బోర్డు పరిపాలన అధికారుల వరకు అందరిపైనా విధించాలి. తప్పుడు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లదే అసలు బాధ్యత. వారికి రెట్టింపు జరిమానా వేయాలి. ఎప్పుడూ ఆటగాళ్లే ఎందుకు శిక్ష అనుభవించాలి?" అని ఆమిర్ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ప్రశ్నించాడు. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన ఫఖర్ జమాన్‌కు కూడా జరిమానా వేస్తారా? అని నిలదీశాడు.

జరిమానాలు విధించడం సరైన పరిష్కారం కాదని, దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయడమే అసలైన మార్గమని ఆమిర్ సూచించాడు. "నిజంగా ఎవరిపైనైనా కోపంగా ఉంటే జరిమానా వేయడం కాదు, జట్టు నుంచి తప్పించండి. రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి తిరిగి జట్టులోకి రావాలని చెప్పండి. ఒక క్రికెటర్‌కు జట్టులో స్థానం కోల్పోవడమే అతిపెద్ద శిక్ష" అని అతడు అభిప్రాయపడ్డాడు.

కాగా, పాక్ ఆటగాళ్ల ప్రదర్శన కేవలం పీసీబీనే కాకుండా ప్రభుత్వంలోని పలుకుబడి ఉన్న వ్యక్తులను కూడా తీవ్రంగా నిరాశపరిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న పాక్ ఆటగాళ్లకు నెలవారీ జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు అందుతున్నాయి. "ఇక చాలు, ఎంత మద్దతు ఇచ్చినా కీలక టోర్నీల్లో జట్టు విఫలమవుతోంది" అనే భావన బోర్డు వర్గాల్లో బలంగా ఉందని సమాచారం. త్వరలోనే ఆటగాళ్ల కాంట్రాక్టులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Mohammad Amir
Pakistan Cricket
PCB
T20 World Cup
Pakistan Cricket Board
Fakhar Zaman
Cricket Fines
Domestic Cricket
Pakistan Team
Cricket Selection

More Telugu News