AP Group 1: గ్రూప్-1 కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కనుసన్నల్లో సిట్ విచారణ

AP Group 1 Case High Court to Oversee SIT Investigation
  • గ్రూప్-1 అక్రమాలపై సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తామన్న హైకోర్టు
  • కేసు ముగిసే వరకు పిటిషన్లు తమ వద్దే ఉంటాయని స్పష్టీకరణ
  • సీఐడీ చీఫ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం
  • ఉత్తర్వుల అమలులో జాప్యం.. సీఎస్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు
  • తదుపరి విచారణు మార్చి 16వ తేదీకి వాయిదా
ఏపీ గ్రూప్-1 (2018) జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను తామే పర్యవేక్షిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం తార్కిక ముగింపునకు వచ్చేవరకు కేసు సంబంధిత పిటిషన్లను తమ వద్దే అట్టిపెట్టుకుంటామని పేర్కొంది. సిట్ పారదర్శకంగా, చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైందా? అని ప్రశ్నించగా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కోర్టుకు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని, అందుకు సంబంధించిన వివరాలతో మెమో దాఖలు చేసినట్లు వివరించారు. 

ఇదే కేసులో ఉద్యోగాలు పొందిన అధికారులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న ఉత్తర్వులను సకాలంలో అమలు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అభ్యర్థి గొర్ల సుజాత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ రెండు కేసుల్లో తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.
 
 
AP Group 1
APPSC
High Court
SIT Investigation
irregularities
Golla Sujatha
K Vijayanand
Shyamala Rao
Ravi Shankar Ayyanar
Andhra Pradesh

More Telugu News