ముగిసిన టీమిండియా ఇన్నింగ్స్... ఆఖరి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టిన నితీశ్
- ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తడబడ్డ భారత బ్యాటర్లు
- వర్షం కారణంగా మ్యాచ్ 26 ఓవర్లకు కుదింపు
- విఫలమైన టాప్ ఆర్డర్.. రోహిత్, కోహ్లీ, గిల్ తక్కువ స్కోరుకే ఔట్
- కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) ఆదుకునే ప్రయత్నం
- 11 బంతుల్లో 19 పరుగులు చేసిన నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు
పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), కెప్టెన్ శుభ్మన్ గిల్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఈ క్లిష్ట సమయంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 38), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 31) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో వీరిద్దరూ కూడా ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (10) కూడా నిరాశపరిచాడు.
వరుస వికెట్లతో భారత్ 125 పరుగుల లోపే పరిమితమయ్యేలా కనిపించిన తరుణంలో, అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడిన అతను, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. కేవలం 11 బంతుల్లోనే 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కున్మాన్ తలా రెండు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్కు చెరో వికెట్ దక్కింది.