విశాఖలో జగన్ పర్యటనకు అనుమతి లేదు... ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది: సీపీ శంఖబ్రత బాగ్చి
- ఈ నెల 9న జరగాల్సిన జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరణ
- అదే రోజు నగరంలో మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్
- మ్యాచ్ బందోబస్తు కారణంగా సిబ్బంది కొరత అని వెల్లడి
- జగన్ పర్యటనతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఆందోళన
- ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరణ
- ఈ విషయాన్ని వైసీపీకి లేఖ ద్వారా తెలియజేసిన పోలీసులు
జగన్ రోడ్డు మార్గంలో మాకవరపాలెం వెళ్లాలని తొలుత ప్రణాళిక వేసుకున్నట్లు వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, సరిగ్గా అదే రోజు (అక్టోబర్ 9న) విశాఖలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరగనుందని సీపీ వివరించారు. ఈ అంతర్జాతీయ మ్యాచ్కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, వారి భద్రత కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను బందోబస్తుకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో, జగన్ పర్యటనకు అదనపు భద్రత కల్పించడం కష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు ర్యాలీగా తరలివస్తే నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని నిర్ణయించుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ నేతలకు అధికారికంగా లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
జగన్ ఈ నెల 9న అనకాపల్లి మాకవరపాలెం వద్ద మెడికల్ కాలేజీని సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పర్యటనకు రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని, జగన్ హెలికాప్టర్ లో వెళ్లాలని జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పర్యటన కోసం జగన్ విశాఖ విమానాశ్రయంలో దిగి అక్కడ్నించి రోడ్డు మార్గంలో మాకవరపాలెం వెళ్లాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖ వచ్చేందుకు అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేయడం పట్ల రాజకీయ విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.