రజనీ ఇదెక్కడి మాయ .. ఇదెక్కడి మంత్రం!
- ఈ నెల 14న విడుదలైన 'కూలీ'
- భారీ ఓపెనింగ్స్ తో మొదలైన రికార్డులు
- 12 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు
- రజనీ కెరియర్లో ఇది మూడో సినిమా
రజనీతో పాటు ఎంట్రీ ఇచ్చిన కమల్ ను పక్కన పెడితే, ఆ తరువాత చాలా మంది హీరోలు తెరపైకి వచ్చారు. కొంతకాలం తరువాత వారి ప్రభ మసకబారడం, వాళ్లు ఇతర కేరక్టర్స్ వైపు వెళ్లిపోవడం జరిగింది. కానీ రజనీ జోరు మాత్రం మరింత రెట్టింపు అవుతూ దూసుకుపోతూనే ఉంది. ఆయన ఏ మాయ చేస్తున్నాడో .. ఏం మంత్రం వేస్తున్నాడో గానీ ఇంకా థియేటర్స్ కి పొలోమంటూ జనాలను రప్పిస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా వెలవెలబోతూ వచ్చిన థియేటర్లు, రీసెంటుగా 'కూలీ' సినిమాతో హౌస్ ఫుల్ కావడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తరాలు మారుతున్న రజనీ క్రేజ్ కొనసాగుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యమే.
ఆగస్టు 14న విడుదలైన 'కూలీ' పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వినిపించాయి. లోకేశ్ కనగరాజ్ చేసిన కొన్ని పొరపాట్లను గురించిన చర్చలు నడిచాయి. అయితే రజనీ క్రేజ్ మాత్రం ఈ సినిమాను రికార్డుల దిశగా లాక్కెళుతూనే ఉంది. విడుదలైన 12వ రోజున (సోమవారం) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. గతంలో ఈ క్లబ్ లో '2.0' .. 'జైలర్' ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసనే 'కూలీ' చేరింది. 500 కోట్ల క్లబ్ లో మూడు సినిమాలు ఉన్న ఏకైక తమిళ హీరో రజనీకాంత్ మాత్రమేనని చెబుతున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.