అజింక్యా రహానే అనూహ్య నిర్ణయం
- ముంబై దేశవాళీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అజింక్యా రహానే
- కొత్త నాయకుడిని సిద్ధం చేయడానికే ఈ నిర్ణయమని వెల్లడి
- సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన సీనియర్ ఆటగాడు
- ఒక ఆటగాడిగా జట్టుకు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టీకరణ
- రహానే సారథ్యంలో ఏడేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై
"ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం, ఛాంపియన్షిప్లు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. రాబోయే దేశవాళీ సీజన్ను దృష్టిలో పెట్టుకుని, ఒక కొత్త నాయకుడిని సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని నేను నమ్ముతున్నాను. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను" అని రహానే 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. అయితే, ఒక ఆటగాడిగా జట్టుకు తన సేవలు అందిస్తూనే ఉంటానని, ముంబైకి మరిన్ని ట్రోఫీలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నాడు.
రహానే సారథ్యంలో ముంబై జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. ఆయన కెప్టెన్సీలోనే 2023-24 సీజన్లో రంజీ ట్రోఫీని గెలుచుకుని, ఏడేళ్ల నిరీక్షణకు తెరదించింది. గత సీజన్లో జట్టును సెమీఫైనల్స్ వరకు నడిపించాడు. ఆయన నాయకత్వంలోనే ముంబై జట్టు గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు 2024-25 ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.
ఆటగాడిగా కూడా ముంబై జట్టుకు రహానే ఎనలేని సేవలందించాడు. 2007 నుంచి 2025 మధ్య 76 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 52 సగటుతో 5,932 పరుగులు చేసి, ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వసిం జాఫర్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 19 శతకాలు కూడా నమోదు చేశాడు.