ఐసీసీ చిన్న పొరపాటు... కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై గందరగోళం!
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి కోహ్లీ, రోహిత్ పేర్లు అకస్మాత్తుగా అదృశ్యం
- సోషల్ మీడియాలో వెల్లువెత్తిన రిటైర్మెంట్ ఊహాగానాలు
- తీవ్ర ఆందోళనకు గురైన క్రికెట్ అభిమానులు
- సాంకేతిక లోపమే కారణమని స్పష్టం చేసిన ఐసీసీ
- ర్యాంకులను తిరిగి పునరుద్ధరించడంతో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ (38), కోహ్లీ (36) ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారి పేర్లు ర్యాంకింగ్స్ నుంచి తొలగించడంతో అభిమానుల ఆందోళన మరింత పెరిగింది. "కోహ్లీ, రోహిత్ లేకుండా వన్డే ర్యాంకింగ్స్ ఏంటి? రిటైర్మెంట్ ప్రకటన రాబోతోందా?", "ఈ వార్త వినడానికి మా మనసు సిద్ధంగా లేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండో స్థానంలో రోహిత్, నాలుగో స్థానంలో కోహ్లీ ఉండగా, ఒక్కసారిగా వారి పేర్లు కనిపించకపోవడం ఈ గందరగోళానికి దారితీసింది.
అయితే, అభిమానుల ఊహాగానాలకు తెరదించుతూ ఐసీసీ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఇది కేవలం ఒక సాంకేతిక లోపం వల్లే జరిగిందని వెల్లడించింది. "ఈ వారం ర్యాంకింగ్స్లో కొన్ని సమస్యలు తలెత్తాయి, వాటిని సరిచేస్తున్నాం" అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. చెప్పినట్టుగానే, కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ర్యాంకులను వారి పాత స్థానాల్లో పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డులు కలిగిన కోహ్లీ, రోహిత్.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్తో పాటు భవిష్యత్ టోర్నీలలోనూ ఆడనున్నారు. ఈ సాంకేతిక లోపం తాత్కాలిక కలకలం సృష్టించినప్పటికీ, వారి రిటైర్మెంట్పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.