దేశ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: డీకే అరుణ
- స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్కు లేదన్న డీకే అరుణ
- రెండు ఎకరాల రైతులకు కూడా రైతు భరోసా అందడం లేదని విమర్శ
- ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకులందరూ బాధితులేనని డీకే అరుణ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కీలకమైన అంశాలపై సీబీఐ విచారణ కోరడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలని ఆమె నిలదీశారు.
జూన్ 25వ తేదీ భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజని ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అరాచకాలు, ప్రజలపై సాగించిన దౌర్జన్యాల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. నాడు పేదలపై అకృత్యాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ, నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత అజెండాను దేశంపై రుద్దేందుకే గతంలో రాజ్యాంగ సవరణలు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ, కీర్తి ప్రతిష్టలను చూసి రాహుల్ గాంధీ ఓర్వలేకపోతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. "ఆపరేషన్ సిందూర్" ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాలను పాకిస్థాన్కు రుచి చూపించామని ఆమె గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోదీని విమర్శించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా ఎమర్జెన్సీ కాలం నాటి కాంగ్రెస్ దురాగతాల గురించి మాట్లాడాలని ఆమె హితవు పలికారు.