Pawan Kalyan: కుంకీ ఏనుగులను నేనే జాగ్రత్తగా చూసుకుంటా... ఏపీ ప్రజల కోసం వీరు హృదయాలనే తెరిచారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Receives Kumki Elephants from Karnataka for AP
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, కర్ణాటక ప్రభుత్వం అందించిన ఐదు కుంకీ ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటక విధానసౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సమక్షంలో ఈ ఐదు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "కుంకీ ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను" అని హామీ ఇచ్చారు.

గత రెండు దశాబ్దాలుగా జనావాసాల్లోకి అడవి ఏనుగులు చొరబడటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తులు ధ్వంసమయ్యాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ రోజు మనకు అందిన ఈ కుంకీ ఏనుగుల వల్ల భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతాం, ఆస్తి నష్టాన్ని కూడా నివారించగలుగుతాం" అని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడం, అటవీ సంపద పరిరక్షణ వంటి పలు కీలక అంశాల్లో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పవన్ వెల్లడించారు. "రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ అనే ముఖ్యమైన అంశంలో సహకరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. వారు కేవలం ఏనుగులనే కాదు, ఆంధ్ర ప్రజల కోసం వారి హృదయాన్నే తెరిచారు" అంటూ కర్ణాటక ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, కుంకీ ఏనుగులకు సంబంధించిన ధృవపత్రాలను, సంరక్షణ వివరాల డాక్యుమెంట్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కు అందజేశారు. ఈ కుంకీల రాకతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు కొంత ఊరట లభించనుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Karnataka
Kumki elephants
Elephant attacks
Forest conservation
Siddaramaiah
DK Shivakumar
Wildlife management
Red sandalwood smuggling

More Telugu News