Kesineni Nani: కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ .. తీవ్ర స్థాయిలో ఆరోపణలు

TDP Leader Budda Venkanna Accuses Kesineni Nani of Serious Charges
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్న నేపథ్యంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నానికి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని, అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్‌కు కోవర్టుగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆరోపించారు.

2019-24 వరకు చంద్రబాబు, లోకేశ్, తాను, ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గళమెత్తామని, జగన్, ఆయన అనుచరులు మద్యం మాఫియాకు పాల్పడుతున్నారని, ఆ అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందని ఆరోజే చెప్పామన్నారు. అయినా జగన్‌పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేశినేని నాని అని బుద్దా అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందని, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందని తెలిపారు.

ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడగా, విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించారని ఆరోపించారు. కేశినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేశారన్నారు. మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ఆయన పేరును ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. కేశినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామని హెచ్చరించారు.

విజయవాడలో పెద్ద హోటల్ కడతామని ఎనిమిదిన్నర కోట్లు బ్యాంకుల నుంచి నాని, ఆయన భార్య కలిసి అప్పు తీసుకున్నారని, కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నామని అన్నారు. ఈ ఆధారాలను అధికారులకు ఇచ్చి విచారణ చేయాలని ఈడీని కోరతామని చెప్పారు. తర్వాత కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరును కేశినేని హారిక పేరుతో మార్చారని, అందులో కూడా కేశినేని నాని, పావని, హేమా చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వీరంతా డైరెక్టర్లుగా తప్పుకుని ఆయన దగ్గర పని చేసే రాము, హేమంత్‌లను డైరెక్టర్లుగా చేశారన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పుకుంటున్నారని ఆరోపించారు. నాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రూపాయి కట్టకుండా మోసం చేసిన నాని విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేశినేని నాని అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తున్నట్లు బుద్దా తెలిపారు. కేశినేని నాని వంటి విషపురుగు పార్టీలో ఉండకూడదనే చంద్రబాబు దూరం పెట్టారని గుర్తు చేశారు. నేడు సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా బురద జల్లడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌కు తెలియకుండా వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది అంటే పదేళ్ల పిల్లాడు కూడా నమ్మడని అన్నారు. కేవలం టీడీపీ పరువు తీయడమే లక్ష్యంగా నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ వెనక ఉండి కేశినేని నానీతో నాటకాలు ఆడిస్తున్నారని అర్థమవుతోందని ఆరోపించారు.

తాను నిజాయతీపరుడినని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్న కేశినేని నాని బాగోతం మొత్తం బయటపెడతామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు కేశినేని నాని చేసిన ఒక్కొక్క మోసాన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తామని అన్నారు. బ్యాంకులకు అప్పు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి ఫైనాన్స్ సంస్థలను కూడా మోసం చేశాడని ఆరోపించారు. కేశినేని నాని గుర్తుపెట్టుకో.. నిన్ను వదిలేది లేదు, నీ అవినీతి చిట్టా మొత్తాన్ని బయటపెడతానని హెచ్చరించారు.

ఈడీ, సీబీఐలకు నాని అవినీతి గురించి లేఖలు రాసి ఆధారాలు అందిస్తానని తెలిపారు. కేశినేని నాని అవినీతి, మోసాల గురించి ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి, ఫైనాన్స్ సంస్థల నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఒక్క రూపాయి అయినా చెల్లించావా అని ప్రశ్నించారు. కేశినేని నాని ఒకటో నంబర్ నుంచి పదో నంబర్ వరకు పెద్ద మోసగాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈడీ, సీబీఐ స్పందించి కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
Go Back to Shorts
Kesineni Nani
Budda Venkanna
TDP
YSRCP
Liquor Scam
ED Complaint
Financial Fraud
Vijayawada
Andhra Pradesh Politics
Hotel Business

More Telugu News