విజయసాయిరెడ్డి స్థానంలో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న అన్నామలై?
- తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై
- దక్షిణాదిన బలోపేతం కావాలనే యోచనలో బీజేపీ హైకమాండ్
- అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం
తాజాగా అన్నామలై గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. తమిళనాడు టు ఢిల్లీ (రాజ్యసభ) వయా ఏపీ అనేదే ఆ ప్రచారం. తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్నందున, ఈ స్థానాన్ని మిత్రపక్షాల సహకారంతో దక్కించుకుని, అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి మండలిలో కూడా స్థానం కల్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు, ఇదే రాజ్యసభ స్థానానికి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన, ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన స్మృతి ఇరానీ పేరు కూడా బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఆమెకు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అన్నామలై విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా అన్నామలైకి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని విశ్వసనీయ సమాచారం.