కుమారుడు గాయపడడంపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Speaks on Sons Injury in Singapore School Fire
  • సింగపూర్ లోని స్కూల్లో అగ్నిప్రమాదం
  • పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలు
  • సింగపూర్ బయల్దేరుతున్న పవన్
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన వైనం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడడం తెలిసిందే. ఉదయం ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం వచ్చానని, ఈ పర్యటన ముగిశాకే సింగపూర్ వెళతానని పవన్ ఉదయం చెప్పారు. 

ఈ సాయంత్రం ఆయన పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొడుకు గాయపడడంపై తొలిసారిగా స్పందించారు. 

అదేదో చిన్న పాటి అగ్ని ప్రమాదం అనుకున్నానని, కానీ ఈ స్థాయిలో జరిగిందనుకోలేదని అన్నారు. "ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? అనేది కూడా నాకు మొదట తెలియలేదు. పర్లేదులే అనుకున్నాను... కానీ తనని (కుమారుడిని) ఆసుపత్రిలో చేర్చినట్టు ఆ తర్వాత తెలిసింది. ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. మా అబ్బాయి పక్కనే కూర్చున్న క్లాస్ మేట్ కు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయట. ఓ పసిబిడ్డ ఈ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసి చాలా బాధ కలిగింది. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన ఈ ఘటన దురదృష్టకరం" అని పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Mark Shankar Pawanovich
Singapore school fire
Son injured
AP Deputy CM
Accident
Bronchoscopy
Summer camp
Tragedy

More Telugu News